సోమశేఖర్ కుటుంబానికి పరామర్శ
ABN , First Publish Date - 2021-06-17T05:21:02+05:30 IST
వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన ఉంగుటూరు సర్పంచి మేదరమెట్ల అనూరాధ భర్త సోమశేఖర్ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పరామర్శించి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి భరోసా
అమరావతి, జూన్ 16: వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన ఉంగుటూరు సర్పంచి మేదరమెట్ల అనూరాధ భర్త సోమశేఖర్ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పరామర్శించి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు, ఎస్సీ కాలనీ మహిళలు గ్రామంలో జరుగుతున్న ఘర్షణలను, వైసీపీ దౌర్జన్యాలను శ్రీధర్కు వివరించారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, నూర్జహాన్, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత 14వ మైలు వద్ద సీఐ రాజేష్కుమార్ తన సిబ్బందితో శ్రీధర్ను అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ తర్వాత ఉంగుటూరు వెళ్లేందుకు అనుమతించారు.
శ్రీధర్ కారును అడ్డుకున్న వైసీపీ నాయకులు
తిరుగు ప్రయాణం అయిన శ్రీధర్ను గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని కారుని నిలుపుదల చేశారు. సుమారు అరగంట పాటు నిలువరించారు. సీఐ, సిబ్బంది అక్కడే ఉన్నా వారిని వారించలేదు. మండల టీడీపీ నాయకులు వైసీపీ వారిని అడ్డుకోబోగా శ్రీధర్ వారిని వారించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు వస్తున్నారనే సమాచారంతో వైసీపీ నాయకులు అక్కడినుంచి తప్పుకున్నారు. ఆయన ఉంగుటూరు చేరుకుని గుంపులుగా ఉన్నవారిని తమ సిబ్బందితో తరిమివేశారు.