మాజీ మంత్రి కొల్లు అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-04T08:37:16+05:30 IST
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా..
విశాఖ వెళుతుండగా తుని వద్ద అదుపులోకి తీసుకున్న కృష్ణా పోలీసులు
మంత్రి పేర్ని అనుచరుడు మోకా హత్యకేసులో నిందితులు కొల్లు పేరు చెప్పారన్న పోలీసులు
మచిలీపట్నం/తుని/అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యో తి): మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపు రం వద్ద జాతీయ రహదారిపై మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వైపు కారు లో వెళుతున్న కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా నుంచి వచ్చిన మూడు ప్రత్యేక పోలీసు బృందాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసుల సహకారంతో హైవేను దిగ్భందించాయి. ఈ క్రమంలో పోలీసులు కొల్లును గు ర్తించి అరెస్టు చేశారు. ఆయనను తుని నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు.
గత నెల 29న మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరా వు(57) మచిలీపట్నం చేపలమార్కెట్ వద్ద హత్యకు గురయ్యారు. ఆ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన సమయంలో కొల్లు రవీంద్ర పేరును ప్రస్తావించి, హత్యకు సహకారం అందించినట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ కారణంతోనే అరెస్ట్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్లో కొల్లు పేరును చేర్చినట్టు మచిలీపట్నం డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు.
ముమ్మాటికీ కక్ష సాధింపే: చంద్రబాబు
కొల్లు రవీంద్ర అరెస్టు ముమ్మాటికీ జగన్ సర్కారు కక్షసాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రాథమిక విచారణ చేయకుండానే ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలోనూ ఇలా జరగలేదన్నారు. కాగా, కొల్లు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.