కొలిక్కిరాని సుధారాణి దారి వివాదం
ABN , First Publish Date - 2022-07-04T09:39:19+05:30 IST
కొలిక్కిరాని సుధారాణి దారి వివాదం
గోడ పడగొట్టేందుకు యత్నం
ఇంజక్షన్ ఆర్డర్ చూపడంతో వెనుదిరిగిన అధికారులు
మేదరమిట్ల, జూలై 3: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి దారి సమస్య పరిష్కారం కాలేదు. అడ్డుగా ఉన్న గోడను పడగొట్టేందుకు వచ్చిన అధికారులు, ఇంజక్షన్ ఆర్డర్ చూసి వెనుదిరిగారు. దారి సమస్య విషయమై సీఎంను కలవడానికి సుధారాణి గతనెల 18న బొడ్డువానిపాలెం నుంచి పాదయాత్రగా తాడేపల్లికి బయల్దేరారు. మంగళగిరి సమీపంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకొని సమస్య పరిష్కరిస్తామంటూ వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్, సర్వేయర్, ఈవోఆర్డీ, ముగ్గురు ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుళ్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ కార్యదర్శులు బొడ్డువానిపాలెంలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రహరీ, రేకుల షెడ్డు తొలగించి సుధారాణికి దారి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆ స్థల యజమాని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కాగితాలను వారికి చూపించారు. దీంతో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నందున తాము గోడ పడగొట్టలేమంటూ అధికారులు వెనుదిరిగారు.