కరోనా కల్లోలం: ఢిల్లీలో మరో రెండు మార్కెట్ల మూసివేత
ABN , First Publish Date - 2021-07-21T12:44:30+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైపు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైపు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, కరోనా నిబంధనల ఉల్లంఘనల కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాజధానిలోని పలు మార్కెట్లు మూతబడుతున్నాయి. తాజాగా కమలా నగర్ ప్రాంతంలోని కొల్హాపూర్ రోడ్ మార్కెట్, ఇన్నర్ సర్కిల్ మార్కెట్ను బుధవారం(ఈరోజు) రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డిడిఎంఎ) జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడం, కోవిడ్ -19 నిబంధనలను పాటించకపోవడం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రోహిణి సెక్టార్ 9లోని డిసి చౌక్ మార్కెట్ నాలుగు రోజులు, లాజ్పత్ నగర్లోని గార్హి మార్కెట్ రెండు రోజుల పాటు మూసివేశారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డిడిఎం) నిబంధనలను పాటించనందుకు సంబంధిత జిల్లా యంత్రాంగం ఈ మార్కెట్లను మూసివేసింది. మార్కెట్ అసోసియేషన్, విక్రేతలు కోవిడ్ నియమాలను సక్రమంగా పాటించడం లేదని, అక్కడికి వచ్చేవారు కూడా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు.