కోహ్లీ జట్టుకు ధోనీ లాంటి ఆటగాడు కావాలి: మైఖేల్ హోల్డింగ్

ABN , First Publish Date - 2020-11-29T01:05:34+05:30 IST

వన్డే క్రికెట్‌లో భారీ స్కోర్లు ఛేదించాలంటే కోహ్లీ జట్టుకు మిడిలార్డర్‌లో ఎంఎస్ ధోనీలాంటి ఆటగాడు అవసరమని వెస్టిండీస్ మాజీ పేసర్

కోహ్లీ జట్టుకు ధోనీ లాంటి ఆటగాడు కావాలి: మైఖేల్ హోల్డింగ్

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌లో భారీ స్కోర్లు ఛేదించాలంటే కోహ్లీ జట్టుకు మిడిలార్డర్‌లో ఎంఎస్ ధోనీలాంటి ఆటగాడు అవసరమని వెస్టిండీస్ మాజీ పేసర్ మైఖేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం హోల్డింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 375 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 308/8కే పరిమితమై ఓటమి పాలైంది.


‘‘ఇండియాలో కొందరు మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే, నాకు తెలిసినంత వరకు ఎంఎస్ ధోనీ జట్టులో లేకపోవడం కోహ్లీ జట్టుకు పెద్ద దెబ్బే. మిడిలార్డర్‌లో ధోనీ క్రీజులోకి వచ్చి చేజింగ్‌పై నియంత్రణ సాధించేవాడు. ధోనీ జట్టులో ఉన్నప్పుడు చక్కగా ఛేదించింది. అంతేకాదు, టాస్ గెలవాలన్న భయం వారిలో ఉండేది కాదు. ఎందుకంటే ధోనీ సామర్థ్యం వారికి తెలుసు. ఇప్పటి బ్యాటింగ్ లైనప్‌లోనూ ప్రతిభ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొందరిలో బ్రహ్మాండమైన స్ట్రోక్ ప్లే ఉంది. అయినప్పటికీ వారికి ధోనీ లాంటి ఆటగాడు కావాలి. ధోనీ లాంటి ప్రతిభ మాత్రమే సరిపోదు, వ్యక్తిత్వం కూడా అలాంటిదై ఉండాలి’’ అని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. 

 

‘‘భారత జట్టు చేజింగ్ సమయంలో ధోనీ ఆందోళన చెందడం మనమెప్పుడూ చూడలేదు. ఎందుకంటే అతడికి తన సామర్థ్యం గురించి తెలుసు. చేజింగ్ ఎలా చేయాలో తెలుసు. తనతోపాటు క్రీజులో ఎవరున్నా సరే. వారితో మాట్లాడుతూ, వారికి సాయం చేస్తూ ముందుకు సాగుతాడు. చేజింగ్ విషయంలో ధోనీ ప్రత్యేకమైన ఆటగాడు’’ అని  హోల్డర్ కొనియాడాడు.

Updated Date - 2020-11-29T01:05:34+05:30 IST