వివాదంలో విరాట్ కోహ్లీ రెస్టారెంట్

ABN , First Publish Date - 2021-11-17T02:26:22+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది

వివాదంలో విరాట్ కోహ్లీ రెస్టారెంట్

పూణె: టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. కోహ్లీకి దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు ఉండగా పూణెలోని రెస్టారెంట్‌‌పై ‘ఎస్ వియ్ ఎగ్జిస్ట్ ఇండియా’ అనే ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ తీవ్ర ఆరోపణలు చేసింది.


ఈ రెస్టారెంట్‌లోకి స్వలింగ సంపర్కులను, ట్రాన్స్‌ కమ్యూనిటీ వారిని అనుమతించడం లేదని ఆరోపించింది. భిన్నలింగ జంటలు, సిస్‌-జెండర్ మహిళల సమూహాలను మాత్రమే అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెంట్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని దుమ్మెత్తి పోసింది. 


ఈ ఆరోపణలపై ‘వన్8 కమ్యూన్’ వర్గాలు స్పందించాయి. తమ రెస్టారెంట్లలో ఎలాంటి లింగ వివక్షకు తావులేదని స్పష్టం చేశాయి. అన్ని వర్గాలకు తాము సేవలు అందిస్తామని పేర్కొన్నాయి. రెస్టారెంట్ల ప్రారంభం నుంచి తాము ఇదే పంథాను అనుసరిస్తున్నట్టు చెప్పాయి.


ఇతర రెస్టారెంట్ల నియమాలే తమ రెస్టారెంట్‌లోనూ ఉంటాయని, దానికి భిన్నంగా ఉండవని ‘వన్8 కమ్యూన్’ స్పష్టం చేసింది. ప్రత్యేకించి ఏ వర్గంపైనా వివక్ష ప్రదర్శించబోమని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్యకాలపాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.


అయితే, ఏ తోడూ లేకుండా ఒంటరిగా వచ్చే వారిపై మాత్రం నిషేధం ఉందని తెలిపింది. అతిథులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతోనే దీనిని అమలు చేస్తున్నట్టు పేర్కొంది. తమవైపు నుంచి ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని అభ్యర్థించింది. 

Updated Date - 2021-11-17T02:26:22+05:30 IST