కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడోచ్!

ABN , First Publish Date - 2022-04-30T22:17:29+05:30 IST

ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు

కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడోచ్!

ముంబై: ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్‌తో కలిసి కోహ్లీ నిలకడగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు.


క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచాడు. మరోవైపు, అతడికి అండగా నిలిచిన పటీదార్ కూడా బ్యాట్ ఝళిపించాడు. ఇద్దరూ కలిసి బంతులను బౌండరీలకు తరలిస్తూ వేగం పెంచారు. ఈ క్రమంలో కోహ్లీ 45 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 43వ అర్ధ సెంచరీ. మరోవైపు, 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (52) పూర్తిచేసుకున్న పటీదార్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 99 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిశాయి. ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కోహ్లీ 55, మ్యాక్స్‌వెల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-04-30T22:17:29+05:30 IST