విహారం.. విషాదాంతం
ABN , First Publish Date - 2022-05-21T05:43:19+05:30 IST
బీచ్లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
కోడూరు బీచ్లో అన్నదమ్ముల మృతి
కళ్లెదుటే కుమారుల మృతితో తల్లిదండ్రుల రోదన
తోటపల్లిగూడూరు, మే 20 : బీచ్లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అలల తాకిడికి కళ్లెదుటే కుమారులు ఇద్దరూ గల్లంతై మృత్యువాతపడటం వారిని కలిచివేసింది. ఈ విషాదకర ఘటన తోటపల్లిగూడూరు మండలం కోడూరు బీచ్లో శుక్రవారం చోటు చేసుకుంది. నెల్లూరు నగరం కరెంటు ఆఫీసు సెంటర్ సమీపంలోని పోస్టల్ కాలనీ 4వ లైన్కు చెందిన పిన్నింటి చంద్రశేఖర్రెడ్డి తన భార్య పావని, ఇద్దరు కుమారులు శశాంక్రెడ్డి (19), ప్రణీత్రెడ్డి (16)లతో కలిసి సరదాగా గడిపేందుకు శుక్రవారం కోడూరు బీచ్కు వచ్చారు. సముద్రంలో మునుగుతున్న సమయంలో ఉన్నట్టుండి వచ్చిన ఓ రాకాసి అల అన్నదమ్ములు శశాంక్ రెడ్డి, ప్రణీత్రెడ్డిలను చుట్టుముట్టింది. తమ్ముడిని కాపాడేందుకు అన్న, అన్నను కాపాడేందుకు తమ్ముడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అల దెబ్బకు ఇద్దరూ సముద్రంలో గల్లంతయ్యారు. కాసేపటికి వారు విగత జీవులుగా తీరానికి కొట్టుకొచ్చారు. కళ్లముందే తమ బిడ్డలు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.