కో‘ఢీ’

ABN , First Publish Date - 2022-01-10T05:32:41+05:30 IST

సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలకు సన్నాహాలు చకచకా సాగిపోతున్నాయి. వాటిని నిర్వహించడంలో ఆరితేరిన వారంతా పందాల కోసం గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కో‘ఢీ’

పెద్ద ఎత్తున పందాలకు సన్నాహాలు

సంప్రదాయం ముసుగులో ఏర్పాట్లు

సహకరిస్తున్న నేతలు

 నిఘా పెట్టిన పోలీసులు

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ గజపతినగరం, జనవరి 9: సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలకు సన్నాహాలు చకచకా సాగిపోతున్నాయి. వాటిని నిర్వహించడంలో ఆరితేరిన వారంతా పందాల కోసం గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులకు తెలిసే అవకాశం లేని స్థావరాలను ఎంపిక చేసుకుంటున్నారు. పందెం కోళ్లను కొద్ది నెలల కిందటి నుంచే ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి పెంపకానికి వేల రూపాయలు ఖర్చు చేశారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. డేగ, నల్ల డేగ, నెమలి పింగళి, ఎర్రగౌడు, పసుపుకాకి రకాల కోడి పుంజులకు సంక్రాంతి సమయంలో చాలా గిరాకీ ఉండడం పరిపాటి. ఇవి పోటీగా సరైనవిగా భావిస్తారు. కోడి పందాలను కొన్ని గ్రామాల్లో సంపదాయంగా భావిస్తున్నారు. మరికొన్ని చోట్ల జూదంగా నిర్వహిస్తున్నారు. వీరు వాటికి కత్తులు కూడా కడుతుంటారు. కోడి పందాల సమయంలో వాటికి కత్తి కట్టడం చట్టవిరుద్ధమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరి క్షణాల్లో పోలీసు యంత్రాంగంపై రాజకీయంగా ఒత్తిడి తేవచ్చునన్న ధీమాతో ఉంటున్నారు.  ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోడి పందాల నిర్వహణపై ఈసారి మరింత పకడ్బందీగా నిఘా పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. 

ఆ ప్రాంతాల్లోనే...

జిల్లాలో గంట్యాడ, గజపతినగరం, డెంకాడ, బొండపల్లి, కొత్తవలస, భోగాపురం, నెల్లిమర్ల, పార్వతీపురం, వేపాడ, బొబ్బిలి, సాలూరు తదితర మండలాల్లో కోడి పందాలు ఎక్కువగా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లోనే పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో ఏటా లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల పండగ రాకముందే బరులు సిద్ధం చేశారు. పుంజులకు జోరుగా శిక్షణ ఇస్తున్నారు. గత వారంలో దత్తిరాజేరు మండలంలోని చుక్కపేట గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించగా పెదమానాపురం  ఎస్‌ఐ బి.బాగ్యం సిబ్బందితో దాడి చేసి రూ.3వేలతో పాటు నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసులు వారికి అనుమానం ఉన్న గ్రామాల్లో నిఘా పెట్టారు. అవగాహన సదస్సులు  నిర్వహిస్తున్నారు. పందాలు చట్టవిరుద్ధమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

మూడేళ్లలో కేసులు ఇలా

సంవత్సరం కేసులు పందెంరాయుళ్లు డబ్బులు సీజ్‌ కోళ్ల స్వాధీనం

2019 18  160 రూ.2, 84, 124 62

2020 38 266 రూ.4, 50, 453 136

2021 60 364 రూ.5, 25, 662 195


కోడి పందాలపై కఠిన చర్యలు

కోడి పందాలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరం. ఇది జీవ హింసకిందకు వస్తుంది. పందాలపై నిఘా పెట్టాలని, ఇదివరకు పట్టుబడిన వారిని బైండోవర్‌ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. పట్టుబడిన వ్యక్తులు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. పందాల్లో దొరికిన వారికి జైలు, జరిమానా రెండూ ఉంటాయి. నిర్వాహకులు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తున్నదీ ఆరా తీస్తున్నాం. 

- దీపికాపాటిల్‌, ఎస్పీ



Updated Date - 2022-01-10T05:32:41+05:30 IST