4 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-11-01T11:34:12+05:30 IST

: సీసీఐ ద్వారా ఈనెల 4 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

4 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

జేడీఏ ఉమామహేశ్వరమ్మ


ఆదోని(అగ్రికల్చర్‌), అక్టోబరు 31: సీసీఐ ద్వారా ఈనెల 4 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శనివారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో రబీ సాగు సమాయత్తంపై మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ జరిగింది. జేడీఏ మాట్లాడుతూ పత్తి మద్దతు ధరకు విక్రయించే రైతుల పేర్లు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించాలన్నారు. క్వింటం రూ.5850 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. బనవాసి కేవీకే శాస్త్రవేత్త డా.శ్రీనివాసులు, డా.చైతన్య మాట్లాడుతూ పత్తి, వేరుశనగ తదితర పంటల్లో వేరుపురుగు, రసంపీల్చే పురుగు, తామర, పేనుబంక తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. వేరుపురుగు రాకుండా విత్తనశుద్ధి చేయాలన్నారు. వేరుశనగలో ఆకుముడత రాకుండా అంతర్‌పంటగా జొన్న, సజ్జ వేసుకోవాలని సూచించారు. నివారణకు ఎకరాకు క్వినాలఫాస్‌ 400 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. పొగాకు, లద్దెపురుగు నివారణకు క్వినాలఫాస్‌ లేదా వేపనూనెను అధికారుల సలహా మేరకు పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డీడీఏ శ్రీలత, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఏడీఏలు అరుణకుమారి, జంబన్న, గిరిష్‌, ఏవోలు పాపిరెడ్డి, నరేంద్ర, హేమలత, శేషాద్రి, రాజేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T11:34:12+05:30 IST