అరటిపండ్లు అమ్ముకోడానికొచ్చి..

ABN , First Publish Date - 2020-10-27T10:45:52+05:30 IST

గిట్టుబాటు ధరలేదు. తోటలో అరటి పండ్లు మాగిపోతున్నాయి. రోడ్డుమీద అమ్ముకోవడానికి వచ్చారు. అంతలోనే ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

అరటిపండ్లు అమ్ముకోడానికొచ్చి..

కారు ఢీకొని అవ్వ, మనవడు మృతి

గాజులపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం 


మహానంది, అక్టోబరు 26: గిట్టుబాటు ధరలేదు. తోటలో అరటి పండ్లు మాగిపోతున్నాయి. రోడ్డుమీద అమ్ముకోవడానికి వచ్చారు. అంతలోనే ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అవ్వామనవడు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మహానంది మండలం గాజులపల్లిలో జరిగింది. అరటి దిగుబడికి గిట్టుబాటు ధర పడిపోయింది. దీంతో తోటల్లోనే పంట ఉండిపోయింది. మాగిపోయి వృథా అవుతోందని గ్రామానికి చెందిన సత్యవతి(60), ఆమె మనువడు చరణ్‌(12), నరసింహులు అనే బాలుడితో కలసి గ్రామం సమీపంలోని తమ తోటలో మాగిన అరటిపండ్లను నంద్యాల-ఒంగోలు ప్రధాన రహదారి మీదికి తీసుకొచ్చారు. అక్కడ పండ్లు అమ్ముకుంటుండగా గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వస్తున్న ఏపీ 21 6779 నంబరు కారు అతివేగంగా వచ్చి రహదారి పక్కన ఉన్న ఈ ముగ్గురినీ ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సత్యవతి, చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడ్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. కారు డ్రైవర్‌ ఖాదర్‌వలిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్న వాళ్లందరినీ కలచి వేశాయి. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2020-10-27T10:45:52+05:30 IST