హత్యకు వాడిన కత్తులు దొరికాయ్
ABN , First Publish Date - 2021-03-02T08:40:22+05:30 IST
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు లభ్యమయ్యాయి.
మంథని/రూరల్, మార్చి 1: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు లభ్యమయ్యాయి. కత్తుల కోసం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి పార్వతి బ్యారేజీలో పోలీసులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన ఆరుగురు డైవర్లతో బ్యారేజీలో గాలించారు. తమ కస్టడీలో ఉన్న కుంట శ్రీను, శివనందుల చిరంజీవిని పోలీసులు బ్యారేజీ వద్దకు తీసుకొచ్చి.. గేట్ నంబరు 53, 54 మధ్య లభించిన కత్తులను చూపించగా అవేనని ధ్రువీకరించారు. ఇక ఈ కేసులో ఏ4గా ఉన్న బిట్టు శ్రీనును 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మంథని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న శ్రీనును విచారణ నిమిత్తం 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు. అనుమతిస్తూ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సోమవారం ఉత్తర్వులిచ్చారు.