ప్రియురాలు హత్య!

ABN , First Publish Date - 2020-11-25T06:52:17+05:30 IST

ప్రియుడే కాలయముడయ్యాడు. ప్రియురాలిని..

ప్రియురాలు హత్య!
నిందితుడు బెస్త రఘు, షాహిదాబీ (ఫైల్‌ ఫొటో)

హెచ్చెల్సీలో తోసేసిన ప్రియుడు

పెళ్లిపీటలెక్కాల్సిన యువతి శవంగా మారిన వైనం 

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన


కళ్యాణదుర్గం(అనంతపురం): ప్రియుడే కాలయముడయ్యాడు. ప్రియురాలిని హతమార్చాడు. మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన యువకుడు బెస్త రఘు, దూదేకుల షాహిదాబీ(19) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి నిరాకరిస్తూ వేరే వారితో పెళ్లి కుదిర్చారు. షాహిదాకు అనంతపురం సమీపంలోని కామర్లపల్లి చెందిన ఓ యువకుడితో ఈనెల 21వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. రఘుకు ఉరవకొండ మండలం హావళిగి గ్రామానికి చెందిన యువతితో బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. ఈనెల 17వ తేదీ రాత్రి ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లి పోయారు. షాహిదాబీ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు సతాన్‌బీ, నబీరసూల్‌ అంతటా గాలించారు. చివరకు రెండు రోజుల తర్వాత కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తె షాహిదా కనిపించడం లేదనీ, తమకు రఘుపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రఘుని ఆదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు.


విచారణలో భాగంగా రఘు 17వ తేదీనే షాహిదాబీని హెచ్చెల్సీలో తోసినట్టు పోలీసులకు చెప్పినా వారు దాన్ని నమ్మలేదని సమాచారం. తర్వాత యువతి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లి బోరున విలపించటంతో రఘును మరోసారి విచారించి, సమాచారాన్ని సేకరించారు. కణేకల్లు సమీపంలోని హెచ్చెల్సీలో షా హిదాను 17వ తేదీ రాత్రే తోసేసినట్లు చెప్పాడు. దీంతో సీఐ శివశంకర్‌నాయక్‌, ఎస్‌ఐ సుధాకర్‌ సిబ్బందితో కలిసి హెచ్చెల్సీలో గాలింపు చేపట్టారు. తుంబిగనూరు-గరుడచేడు కెనాల్‌ కల్వర్టు వద్ద మృతదేహం లభించింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రఘుపై కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించిన్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2020-11-25T06:52:17+05:30 IST