పార్కులో శిలాఫలకం తొలగింపు!
ABN , First Publish Date - 2022-06-29T06:30:24+05:30 IST
కె.ఎల్.రావుపార్కులోని తెలుగు తల్లి విగ్రహానికి ఉన్న శిలాఫలకం తొలగింపు వివాదాస్పదంగా మారింది.
వివాదాస్పదంగా వీఎంసీ అధికారుల చర్యలు
ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకేనన్న మాజీ కార్పొరేటర్
చిట్టినగర్, జూన్ 28 : కె.ఎల్.రావుపార్కులోని తెలుగు తల్లి విగ్రహానికి ఉన్న శిలాఫలకం తొలగింపు వివాదాస్పదంగా మారింది. పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా టీడీపీ హయాంలో అప్పటి కార్పొరేటర్, విద్యా సాంస్కృతిక కమిటీ వైస్ చైర్మన్ గుర్రం కనకదుర్గ తెలుగు తల్లి విగ్రహాన్ని పార్కు ఎంట్రన్స్లో ఆవిష్కరించారు. అదే తేదీతో విగ్రహానికి శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం వీఎంసీ ఉద్యానశాఖ అధికారులు ఆ శిలాఫలకాన్ని తొలగించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే వీఎంసీ సిబ్బంది శిలాఫలకాన్ని తొలగించారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు శిలాఫలకం బాగానే ఉంది. కానీ అధికారులు మాత్రం శిలాఫలకం దెబ్బతినటంతో తొలగించామని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే ఈ శిలాఫలకం తొలగించారని విమర్శలు గుప్పుమంటున్నాయి. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ గుర్రం కనకదుర్గ మాట్లాడుతూ ప్రజల్లో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏం చేయాలో తెలియక ఇలా శిలాఫలకాలను తొలగిస్తున్నారని, ఇంతకంటే దారుణం ఏ ముందన్నారు. అధికార పార్టీ చేతులో వీఎంసీ అధికారులు కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారన్నారు. సంబంధిత ఉద్యాన శాఖ ఏఈ పుల్లారావును వివరణ కోరగా విగ్రహం అక్కడక్కడ దెబ్బతినటంతో సి బ్బంది తెలియక తొలగించారని, మరలా వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.