పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్.. 53 పరుగులకే 8 వికెట్లు డౌన్

ABN , First Publish Date - 2021-12-04T20:54:05+05:30 IST

భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది...

పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్.. 53 పరుగులకే 8 వికెట్లు డౌన్

ముంబై: భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత బౌలర్ల దెబ్బకు కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్ గింగిరాలు తిరుగుతున్నారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.


పదునైన బంతులను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకుని వెనుదిరుగుతున్నారు. 10 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన కివీస్.. 53 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కోలుకోలేని కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటి వరకు ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ చేసిన పది పరుగులకే అత్యధికం కావడం గమనార్హం. 


అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్ స్కోరు 221/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నేడు 6 వికెట్లు చేజార్జుకుంది. నిన్న నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్.. నేడు మరో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు.


భారత బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసిన కివీస్ భారత్ కంటే 266 పరుగులు వెనకబడి ఉంది.

Updated Date - 2021-12-04T20:54:05+05:30 IST