బాధితులు ఫుల్‌.. కిట్లు నిల్‌

ABN , First Publish Date - 2022-01-22T04:31:20+05:30 IST

కరోనా టెస్టుల కోసం శుక్రవారం జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రికి భారీగా జనం వచ్చారు.

బాధితులు ఫుల్‌.. కిట్లు నిల్‌
ఆస్పత్రి అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రజలు

ఆస్పత్రి సిబ్బందితో జనం వాగ్వాదం 

మదనపల్లె క్రైం, జనవరి 21: కరోనా టెస్టుల కోసం శుక్రవారం జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రికి భారీగా జనం వచ్చారు. అయితే టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో లేవని అక్కడి సిబ్బంది అనడంతో జనం వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సాధారణ లక్షణాలున్నా టెస్టుల్లో పాజిటివ్‌ వస్తోంది ఆందోళనకు గురైన జనం టెస్టులు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి 60 నుంచి 70 మంది జనం టెస్టుల కోసం వచ్చారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 20 మందికి టెస్టులు చేసి ఆ తరువాత కిట్లు లేకపోవడంతో ఆపేశారు. దీంతో జనం వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఆంజనేయులు, ఆర్‌ఎంవో నరసింహాశాస్ర్తిలు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ, దేవ, తిరమలప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు మద్దతు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లోపు కిట్లు అందుబాటులో లేకుంటే ఆస్పత్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో జనం అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. 

Updated Date - 2022-01-22T04:31:20+05:30 IST