Delhi: దేశంలో కొత్త ఉత్సాహం వచ్చింది: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-22T16:54:33+05:30 IST

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు.

Delhi: దేశంలో కొత్త ఉత్సాహం వచ్చింది: కిషన్ రెడ్డి

ఢిల్లీ (Delhi): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu) గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో వందశాతం ముర్ముకు ఓట్లెయ్యటం అభినందనీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ద్రౌపది ముర్ముకు ఓట్లేసి గెలిపించారన్నారు. ఇవాళ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్‌ (Ramnath Kovind)కు వీడ్కోలు విందు ఇవ్వనున్నారని, రేపు రాష్ట్రపతి కొవింద్ కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, ప్రముఖులకు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.


కాగా అంతా ఊహించినట్లుగానే జరిగింది. 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. గురువారం పది గంటల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె 64 శాతం ఓట్లు సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు 6,76,803 ఓట్లు దక్కగా, ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ అధికారికంగా ద్రౌపది ముర్మును విజేతగా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అధిరోహించిన వారిలో ముర్ముయే అత్యంత పిన్న వయస్కురాలు. ఆమెకు ముందున్న రాష్ట్రపతులంతా స్వాతంత్య్రం రాకముందు జన్మించిన వారు కాగా ఆమె స్వాతంత్ర్యానంతర తరానికి చెందిన వారు. నరేంద్ర మోదీ కూడా స్వాతంత్ర్యానంతరం జన్మించిన తొలి ప్రధాని. రాష్ట్రపతి పదవికి ముర్ము ఎన్నిక తరం మార్పునకు సంకేతం. మూడో రౌండ్‌లోనే ముర్ముకు చెల్లిన ఓట్లలో 53శాతం రావడంతో ఆమె విజయం ఖాయమైంది. అప్పటికి ఇంకా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌ ఫలితాలు రాగానే యశ్వంత్‌ సిన్హా తన ఓటమిని అంగీకరించి, కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-07-22T16:54:33+05:30 IST