కిరణ్ మజుందార్ షా మాటలు తప్పు అని రుజువైంది : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-04-15T16:26:02+05:30 IST

కర్ణాటకలో మతపరమైన విభజన జరుగుతోందని ఆందోళన

కిరణ్ మజుందార్ షా మాటలు తప్పు అని రుజువైంది : కేంద్ర మంత్రి

బెంగళూరు : కర్ణాటకలో మతపరమైన విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా చెప్పిన మాటలు తప్పు అని రుజువైందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఏప్రిల్ 14 గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాష్ట్రంలో మతపరమైన సమస్యలేవీ లేవని, కిరణ్ మజుందార్ షా వ్యక్తం చేస్తున్న ఆందోళన తప్పు అని తేటతెల్లమైందని చెప్పారు. 


కర్ణాటకలో ఇటీవల హిజాబ్ వివాదం, దేవాలయాల పరిసరాల్లో ముస్లిం వ్యాపారులపై నిషేధం వంటి వివాదాల నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌కి ఓ విజ్ఞప్తి చేశారు. అందరికీ అవకాశం ఉండే సమ్మిళిత వాతావరణాన్ని హామీ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. 



బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేని సమస్యలేవీ లేవని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయంగా బలహీనపడిన విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కిరణ్ మజుందార్ షా చాలా అంశాలపై ట్వీట్లు చేశారని, కానీ అవన్నీ తప్పు అని రుజువైందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై దర్యాప్తు జరిపించి, చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారన్నారు. బెంగళూరు కాస్మొపాలిటన్ సిటీ అన్నారు. 


కర్ణాటకలో మతపరమైన సమస్య లేదన్నారు. ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించే శక్తులు కొన్ని ఉన్నాయని చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ వంటి పార్టీలు ఇటువంటివాటిని సృష్టిస్తాయని, ఇలాంటి సమస్యలను సాగదీస్తాయని తెలిపారు. 


Updated Date - 2022-04-15T16:26:02+05:30 IST