సెంచరీతో ధావన్ వన్‌మ్యాన్ షో.. పంజాబ్ టార్గెట్ 165

ABN , First Publish Date - 2020-10-21T03:01:33+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లో...

సెంచరీతో ధావన్ వన్‌మ్యాన్ షో.. పంజాబ్ టార్గెట్ 165

ధావన్ సెంచరీ

ఢిల్లీ స్కోర్ 164-5

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు ముందు 165 పరుగుల టార్గెట్‌ను నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టుకు ఓపెనర్ పృథ్వీ షా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నీషమ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన పృథ్వీ షా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన పంత్ ఇవాళ మ్యాచ్‌లో ఆడినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు.


ఓపెనర్ పృథ్వీ షా రాణించకపోయినప్పటికీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం మరోసారి సత్తా చాటాడు. గత మ్యాచ్‌లో చెన్నై జట్టుపై 101 పరుగులతో రాణించి సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన ధావన్ ఇవాల్టి మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాడు. 61 బంతుల్లో 3 సిక్స్‌లు, 12 ఫోర్లతో సత్తా చాటి 106 పరుగులతో సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్‌లో 5వేల పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. ధావన్ వన్‌మ్యాన్ షోతో ఢిల్లీ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్స్ విఫలమైనప్పటికీ ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో షమీకి రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్‌లకు తలో వికెట్ దక్కింది.

Updated Date - 2020-10-21T03:01:33+05:30 IST