రాహుల్‌ పంజా

ABN , First Publish Date - 2020-09-25T09:22:12+05:30 IST

అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 ..

రాహుల్‌ పంజా

శతకంతో అదుర్స్‌

బెంగళూరు ఘోర పరాజయం

 

తొలి మ్యాచ్‌ను అనూహ్య పరిస్థితుల్లో కోల్పోయిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ అద్భుతంగా కోలుకుంది. ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలిచిన కెప్టెన్‌ రాహుల్‌.. బెంగళూరుపై యధేచ్ఛగా విరుచుకుపడి ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇక జట్టులో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా కూడా కనీసం రాహుల్‌ స్కోరును కూడా అందుకోలేక కోహ్లీసేన చిత్తుగా ఓడింది.


దుబాయ్‌: అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్‌) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్‌ (3/21), రవి బిష్ణోయ్‌ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్‌ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా ధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 206 పరుగులు చేసింది. దూబేకు 2వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు.

4 రన్స్‌కే 3 వికెట్లు..: భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దారుణంగా ఆరంభించింది. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టును స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, ఎం.అశ్విన్‌ చావుదెబ్బ తీశారు. ఇక తొలి మూడు ఓవర్లలోనే దేవదత్‌ (1), ఫిలిప్‌ (0), కెప్టెన్‌ కోహ్లీ (1) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి జట్టు స్కోరు 4 పరుగులే. ఈ దశలో డివిల్లీర్స్‌ (28) కాసేపు వేగం కనబరిచాడు. ఐదో ఓవర్‌లో 6,4.. ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. అయితే పంజాబ్‌ స్పిన్నర్లు ఏబీ, ఫించ్‌ (20) వికెట్లను తీయడంతో బెంగళూరు పరాజయం ఖాయమైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (30) కాస్త ఫర్వాలేదనిపించినా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి చిత్తయింది.

ఆది నుంచి చివరి వరకు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ రాహుల్‌ ఒంటి చేత్తో నడిపించాడు. ఏ దశలోనూ ఇబ్బంది పడని రాహుల్‌ చక్కటి భాగస్వామ్యాలను ఏర్పరుస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాహుల్‌-మయాంక్‌ (26) శుభారంభాన్నందించారు. అటు చాహల్‌ ఓవర్లను జాగ్రత్తగా ఆడుతూ ముందుకు కదిలారు. రెండో ఓవర్‌లో రాహుల్‌.. మూడో ఓవర్‌లో మయాంక్‌ రెండేసి ఫోర్లతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కూడా చెరో ఫోర్‌ సాధించగా పవర్‌ప్లేలో పంజాబ్‌ 50 పరుగులు చేసింది. కానీ చక్కగా కుదురుకున్న ఈ జోడీని చాహల్‌ ఓ అద్భుత గూగ్లీతో విడదీశాడు. ఫామ్‌లో ఉన్న మయాంక్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగింది. అయితే పూరన్‌ (17)తో కలిసి రాహుల్‌ రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఉమేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌పదో ఓవర్‌లో పూరన్‌ ఓ ఫోర్‌ సాధించగా రాహుల్‌ 6,4తో చెలరేగి మొత్తం 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక 13వ ఓవర్‌లో రాహుల్‌ బాదిన మూడు ఫోర్లతో స్కోరులో మరింత వేగం పెరిగింది. కానీ దూబే ఝలక్‌ ఇస్తూ పూరన్‌, మ్యాక్స్‌వెల్‌ (5) వికెట్లు తీశాడు. 

పాపం.. కోహ్లీ : వికెట్లు పడుతున్నా రాహుల్‌ మోత మాత్రం ఆగలేదు. నిజానికి రాహుల్‌ ఇన్నింగ్స్‌ 83 పరుగుల వద్దే ముగియాలి. సైనీ వేసిన 17వ ఓవర్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను కోహ్లీ డీప్‌ మిడ్‌వికెట్‌లో పట్టుకోలేక పోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే లాంగా్‌ఫలో కోహ్లీ అతడి క్యాచ్‌ను రెండోసారి అందుకోలేకపోయాడు. ఇలా అందివచ్చిన అవకాశాలతో చెలరేగిన రాహుల్‌ ఆ తర్వాత కేవలం 14 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. స్టెయిన్‌ వేసిన 19వ ఓవర్‌లో విశ్వరూపం చూపుతూ వరుసగా 4,6,6,0,4,6 బాదడంతో పాటు 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌ను దూబే వేయగా చివరి మూడు బంతులను 4,6,6తో ముగించి జట్టు స్కోరును 200 దాటించాడు. ఈ బాదుడుకు చివరి రెండు ఓవర్లలోనే 49 పరుగులు నమోదవ డం విశేషం.


సచిన్‌ను దాటేశాడు..

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. కేవలం 60 ఇన్నింగ్స్‌లోనే అతడీ ఫీట్‌ సాధించాడు. దీంతో 8 ఏళ్ల క్రితం (2012లో 63 ఇన్నింగ్స్‌) సచిన్‌ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 


1 ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (132) సాధించిన భారత ఆటగాడిగా రాహుల్‌.


స్కోరుబోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (నాటౌట్‌) 132, మయాంక్‌ (బి) చాహల్‌ 26, పూరన్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) దూబే 17, మ్యాక్స్‌వెల్‌ (సి) ఫించ్‌ (బి) దూబే 5, కరుణ్‌ నాయర్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 206/3; వికెట్ల పతనం: 1-57, 2-114, 3-128; బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 3-0-35-0, స్టెయిన్‌ 4-0-57-0, సైనీ 4-0-37-0, చాహల్‌ 4-0-25-1, సుందర్‌ 2-0-13-0, దూబే 3-0-3-0. 


బెంగళూరు: దేవదత్‌ పడిక్కల్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) కాట్రెల్‌ 1, ఫించ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 20, జోష్‌ ఫిలిఫ్‌ (ఎల్బీ) షమి 0, కోహ్లీ (సి) రవి బిష్ణోయ్‌ (బి) కాట్రెల్‌ 1, డివిల్లీర్స్‌ (సి) సర్ఫ్‌రాజ్‌ (బి) ఎమ్‌.అశ్విన్‌ 28, సుందర్‌ (సి) అగర్వాల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 30, దూబే (బి) మ్యాక్స్‌వెల్‌ 12, ఉమేష్‌ యాదవ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 0, సైనీ (బి) ఎమ్‌.అశ్విన్‌ 6, స్టెయిన్‌ (నాటౌట్‌) 1, చాహల్‌ (ఎల్బీ) ఎమ్‌.అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 17 ఓవర్లలో 109 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-2, 2-3, 3-4, 4-53, 5-57, 6-83, 7-88, 8-101, 9-106; బౌలింగ్‌: షెల్డన్‌ కాట్రెల్‌ 3-0-17-2, షమి 3-0-14-1, రవి బిష్ణోయ్‌ 4-0-32-3, మురుగన్‌ అశ్విన్‌ 3-0-21-3, నీషమ్‌ 2-0-13-0, మ్యాక్స్‌వెల్‌ 2-0-10-1. 

Updated Date - 2020-09-25T09:22:12+05:30 IST