హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నా జగన్: కిమిడి కళా వెంకట్రావు
ABN , First Publish Date - 2021-12-29T16:49:22+05:30 IST
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు.
విశాఖపట్నం: రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా.. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి హిందూమతం పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. జగన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుమారు 230 పైగా దేవాలయాలపై దాడులు జరిగినా ఇంతవరకు ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు లేవని కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు.
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైందని నిలదీశారు. ఆలయాలను ధ్వంసం చేసిన నిందితులను ఎంతమందిని పట్టుకున్నారని ప్రశ్నించారు. దేవాలయాలను అభివృద్ధి చేయడం లేదని, ఆలయాలపై దాడులు పెరిగిపోతున్న చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్రెడ్డికి దేవాలయాల ఆస్తులు, భూముల మీద ఉన్న శ్రద్ధ దేవాలయాల భద్రత, అభివృద్ధిపై లేకపోవటం సిగ్గుచేటన్నారు. జగన్ తన స్వార్థం కోసం మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే తప్ప మత సామరస్యాన్ని ఎలా కాపాడాలో జగన్రెడ్డికి తెలియదని కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.