మా తాతను చంపేశారన్నా!
ABN , First Publish Date - 2021-05-09T08:17:19+05:30 IST
‘బెడ్ కోసం రుయా సూపరింటెండెంట్కు 11 సార్లు ఫోన్ చేశా. చివరకు జేసీ గారికి కూడా ఫోన్ చేశా. ఎక్కడా బెడ్ దొరకలేదు. అక్కడికీ ఇక్కడికీ తిప్పారు. చివరికి మా తాతను చంపేశారన్నా’’...
4వ తేదీన వస్తే బెడ్ దొరకలేదు
మళ్లీ వచ్చినా అదే పరిస్థితి
చివరికి.. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘బెడ్ కోసం రుయా సూపరింటెండెంట్కు 11 సార్లు ఫోన్ చేశా. చివరకు జేసీ గారికి కూడా ఫోన్ చేశా. ఎక్కడా బెడ్ దొరకలేదు. అక్కడికీ ఇక్కడికీ తిప్పారు. చివరికి మా తాతను చంపేశారన్నా’’... యూట్యూబ్ చానల్ నడుపుతున్న శశికాంత్ అనే వ్యక్తి ఆవేదన ఇది! ‘నాకూ కొవిడ్ వచ్చింది. నన్నూ చంపేయండి’ అంటూ తాత మృతదేహం ముందే అతను రోదించారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా గురవరాజుపల్లెకు చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పిట్టల వెంకటరమణ(84)కు ఈనెల ఒకటో తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా.. 4వ తేదీ అస్వస్థతకు గురవడంతో తిరుపతిలోని ఎస్వీఆర్ రుయాస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్స్ ఖాళీ లేవని చెప్పడంతో... తిరిగి స్వగ్రామానికి తీసుకెళ్లి చికిత్స కొనసాగించారు. శనివారం పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ ద్వారా మళ్లీ రుయాకొచ్చారు. అత్యవసరంగా ఆక్సిజన్ బెడ్ అవసరమని 108 సిబ్బంది చెప్పినప్పటికీ... బెడ్స్ దొరకలేదు. దాదాపు మూడున్నర గంటలపాటు బెడ్ కోసం ఎదురుచూసి.. ఊపిరి ఆడక వెంకటరమణ మృతి చెందారు. దీంతో మనవడు శశికాంత్ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.