ఈ లక్షణాలను తేలిగ్గా తీసేయకండి!
ABN , First Publish Date - 2022-03-21T17:39:55+05:30 IST
కిడ్నీ జబ్బును ముందుగా గుర్తించలేం అంటారు. కానీ కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు వైద్యనిపుణులు
ఆంధ్రజ్యోతి(21-03-2022)
కిడ్నీ జబ్బును ముందుగా గుర్తించలేం అంటారు. కానీ కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు వైద్యనిపుణులు. ఆ లక్షణాల పట్ల అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు.
తరచుగా కాళ్లలో క్రాంప్స్ వస్తున్నట్లయితే కిడ్నీ జబ్బుకు సంకేతం కావచ్చు. పొటాషియం, సోడియం, క్యాల్షియం, ఇతర ఎలక్ర్టోలైట్ల లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది కండరాలు, నరాల వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.కిడ్నీలు టాక్సిన్స్ను సరిగ్గా వడబోయలేకపోతే దాని ప్రభావం మెదడుపై పడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల మగతగా ఉంటారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చిన్నచిన్న అంశాలను కూడా గుర్తుపెట్టుకోలేకపోతారు. చర్మం పొడిబారడం, దురద వంటి లక్షణాలు ఉంటాయి. రక్తంలో పోషకాల, లవణాల అసమతుల్యత చర్మంపై దురద రూపంలో కనిపిస్తుంది. రక్తంలో ఫాస్ఫరస్ స్థాయిలు పెరగడం వల్ల దురద వస్తుంది. కాళ్లు, పాదాలు, చేతులు ఉబ్బినట్టుగా ఉంటాయి.
ముఖం కూడా పఫ్ఫీగా మారుతుంది. కాళ్లు ఉబ్బడం స్పష్టంగా కనిపిస్తుంది. మూత్రంలో ప్రొటీన్ పోవడం వల్ల కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా అవుతుంది. కిడ్నీల వడబోత దెబ్బతిన్నప్పుడు యురేమియా అనే సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ వల్ల భోజనం కూడా రుచించదు. ఆకలి తగ్గిపోతుంది. మూత్ర విసర్జనలో తేడా వస్తుంది. మూత్రం నురగగా వస్తుండటాన్ని గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ కిడ్నీ జబ్బును తెలియజేసేవే. అయితే లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీ ఫెయిల్యూర్ అని నిర్ధారణకు రావడం సరైనది కాదు. వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.