ఖరీఫ్‌ జోష్‌

ABN , First Publish Date - 2020-08-08T07:36:40+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ఆశాజనంగా మొదలైంది. వేసవి నుంచే వర్షాలు కురవడం, ..

ఖరీఫ్‌ జోష్‌

సంతృప్తికంగా వర్షాలు

చెరువులు, రిజర్వాయర్లు ఫుల్‌

జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరు విడుదల

ముమ్మరంగా వరి నాట్లు 

ఇప్పటికే 25 శాతం పూర్తి

అన్ని పంటలు కలిపి 42 శాతం విస్తీర్ణంలో విత్తిన రైతులు


విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ఆశాజనంగా మొదలైంది. వేసవి నుంచే వర్షాలు కురవడం, నైరుతి రుతుపవనాలు   సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు పడడంతో చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా చేరింది. దీంతో గత వారం పది రోజుల్లో తాండవ, కోనాం, కల్యాణపులోవ, రైవాడ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశారు. పెద్దేరు నుంచి నీరు విడుదల కావల్సి ఉంది. 


సాధారణంగా మైదానం కంటే ఏజెన్సీలో ఖరీఫ్‌ సాగు ముందుగా ప్రారరంభమవుతుంది. ఏజెన్సీలో వర్షాలు ఎక్కువగా ఉండడంతో వాగులు, గెడ్డల ద్వారా వచ్చే నీటితో వరి సాగు గత నెలలోనే శ్రీకారం చుట్టారు. వరితోపాటు రాగి, జొన్న, చిరు ధాన్యలు, పప్పు దినుసుల సాగు ఎక్కువగా చేపట్టారు. మైదానంలో సాధారణంగా ఆగస్టు నెల ప్రారంభం నుంచి వరినాట్లు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది జూలై మూడో వారంలోనే వరినాట్లు వేయడం ప్రారంభమైంది. తొలుత  బోర్లు, చెరువుల కింద వరినాట్లు చేశారు. వారం వ్యవధిలో రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో ప్రస్తుతం ఆయా ఆయకట్టు ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకునున్నాయి. రిజర్వాయర్ల కింద 85,765 ఎకరాల ఆయకట్టు ఉంది. తాండవ కింద 32,687 ఎకరాలు, రైవాడ కింద 15,344 ఎకరాలు, కోనాం 12,638, పెద్దేరు  19,969, కళ్యాణపులోవ కింద 4,488 ఎకరాల ఆయకట్టు వుంది. 


నైరుతి రుతుపవనాల సీజన్‌ నాలుగు నెలల్లో(జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు) 712 మి.మీ. వర్షపాతం కురవాలి. జూన్‌, జూలైతోపాటు ఆగస్టులో ఇంతవరకు 354.5 మి.మీతో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 128.8 మి.మీ.కిగాను 142.2, జూలైలో 197.3మి.మీ.కిగాను 192.8 మి.మీ.ల వర్షం కురిసింది. గడచిన వారం రోజుల నుంచి జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నీటి ఇబ్బందిలేకపోవడంతో ఖరీఫ్‌ పంటల సాగు, దిగుబడుల విషయంలో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. 


జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌గాలో అన్ని రకాల పంటలు 1,80,164 హెక్టార్ల సాగు కావల్సి వుంది. జూలై నెలాఖరునాటికి 75,387 హెక్టార్లల్లో(42శాతం) పంటలు వేశారు. వరి 1,02,074 హెక్టార్లకుగాను 24,221 హెక్టార్లు(24శాతం) నాట్లు వేశారు.  ఏజెన్సీలో 42 వేల హెక్టార్లకుగాను 18 వేల హెక్టార్లలో నాట్లు వేశారు. కాగా రెండు రోజుల తరువాత ఉత్తరకోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లాలో మెట్టప్రాంతాల్లో కూడా ఖరీఫ్‌ పనులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడనున్నదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-08T07:36:40+05:30 IST