బంధువుల యువతికి మెసేజ్ పంపారంటూ గొడవ..
ABN , First Publish Date - 2021-09-01T18:12:28+05:30 IST
బంధువుల యువతికి మెసేజ్ పంపారన్న విషయంపై ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది.
ఖమ్మం: బంధువుల యువతికి మెసేజ్ పంపారన్న విషయంపై ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురికావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. గుదిమళ్లలో తమ బంధువుల యువతికి అదే గ్రామానికి చెందిన వెంకన్న ఫోన్ మెసేజ్ పంపాడు. ఈ విషయంపై వెంకన్నను యువతి బంధువు రవి నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
రవిపై కక్ష పెంచుకున్న వెంకన్న తన స్నేహితులతో కలిసి రవిపై ఘర్షణకు దిగాడు. అదే సమయంలో వెంకన్న స్నేహితుడు విజయ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రవితో పాటు అతని బంధువులు ప్రవీణ్, చంటి గాయపడ్డారు. నిందితులు విజయ్ కుమార్తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.