Khairatabad Bada Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-09T18:32:19+05:30 IST
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganapati) శోభాయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న మహా గణపతి (Khairatabad bada ganesh) గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వెల్డింగ్ పనులు పూర్తి అవడంతో మహాగణపతికి ఉత్సవ సమితి నిర్వాహకులు హారతి ఇచ్చి శోభాయాత్ర (Shobha yatra)ను మొదలుపెట్టారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ (Ganesh immersion) భక్తులకు దర్శనమిచ్చారు. తొలిసారి 50 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్కు చేరుకుని మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మట్టి గణపతి కారణంగా నిర్వాహకులు నిమజ్జనానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.
ఖైరతాబాద్ మండపం నుంచి సెన్షేషన్ థియేటర్ నుంచి రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వద్దకు ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నాడు. సుమారు 3 గంటల ప్రాంతంలో మహాగణపతి నిమజ్జం పూర్తి అయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా... ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కాస్త ఆలస్యంగా మొదలైంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. వెల్డింగ్ పనులు పూర్తి అయిన వెంటనే శోభాయాత్రను నిర్వాహకులు ప్రారంభించారు. వేలాది మంది భక్తులతో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది.