కేజీ బేసిన్ నుంచి మరింత గ్యాస్
ABN , First Publish Date - 2021-07-26T07:15:42+05:30 IST
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోని ఎంజే ఫీల్డ్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తెలిపింది. కంపెనీ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల తర్వాత ఇన్వెస్టర్లకు...
- వచ్చే ఏడాది నుంచి ఎంజే ఫీల్డ్లో ఉత్పత్తి
- రిలయన్స్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది డిసెంబరు నాటికి కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లోని ఎంజే ఫీల్డ్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తెలిపింది. కంపెనీ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల తర్వాత ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజెంటేషన్లో ఈ విషయం పేర్కొంది. ప్రస్తుతం ఈ క్షేత్రంలో బావుల తవ్వకం, ఇతర పనులు చురుగ్గా కొనసాగుతున్నట్టు తెలిపింది. కేజీ బేసిన్లోని డీ-6 బ్లాకులో ఉన్న ఈ క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఆర్, శాటిలైట్ క్లస్టర్ అనే రెండు ప్రాంతాల్లో గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఆర్ క్లస్టర్లో గత ఏడాది డిసెంబరు నుంచి, శాటిలైట్ క్లస్టర్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో ఎంజే క్లస్టర్ నుంచి కూడా గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ మూడు క్షేత్రాల నుంచి రోజుకు మూడు కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఎంజే క్లస్టర్ నుంచి గ్యాస్తో పాటు కొద్ది స్థాయిలో ముడి చమురు కూడా లభిస్తుంది. బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) కంపెనీతో కలిసి రిలయన్స్ ఈ క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది.