కాపు నేతల కీలక భేటీ.. బోండా ఉమా, గంటా హాజరు

ABN , First Publish Date - 2022-02-27T23:36:38+05:30 IST

విశాఖలో కాపు నేతలు కీలక భేటీ నిర్వహించారు. ప్రధానంగా ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వాన్ని కాపు నేతలు తూర్పారపట్టారు.

కాపు నేతల కీలక భేటీ.. బోండా ఉమా, గంటా హాజరు

విశాఖ: విశాఖలో కాపు నేతలు కీలక భేటీ నిర్వహించారు. ప్రధానంగా ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వాన్ని కాపు నేతలు తూర్పారపట్టారు. గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం అమలవుతున్న వాటిపై చర్చించారు. కాపు రిజర్వేషన్లు, సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేశారని నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల కోసం గతంలో రూ.3 వేల కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం నిధుల కేటాయింపులు లేవని కాపు నేతల ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్లపై వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. కాపుల సంక్షేమంపై ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కాపు కులంతో పాటు రాష్ట్రం కూడా సర్వనాశనం అవుతుందని నేతల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కాపు నేతలు మౌనంగా ఉంటున్నారని సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. 


ఈ సమావేశానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ రిటైర్డ్‌ అధికారులు, రాజకీయ నేతలు హాజరైనారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కమిటీలను నియమించాలని, జిల్లాకు నలుగురిని పంపి కాపు సంఘాలను ఏకంచేయాలని  నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ చీఫ్‌ సెక్రటరీ రామ్మోహన్, బోండా ఉమా, గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి భాను హాజరయ్యారు. ఫోరం ఫర్‌ బెటర్‌ ఏపీ పేరిట ముందుకు వెళ్లాలని సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. 


ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థను స్థాపించామని మాజీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. బహుజన, కాపు సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పనిచేయబోతోందని ప్రకటించారు. ఈ సంస్థ ఏపీలో ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేస్తుందని, భవిష్యత్‌లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించొచ్చని సాంబశివరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-27T23:36:38+05:30 IST