లాక్‌డౌన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

ABN , First Publish Date - 2020-05-22T16:05:40+05:30 IST

రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన...

లాక్‌డౌన్ నేపథ్యంలో కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్

ముంబై: రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్‌దాస్‌ వెల్లడించారు.


మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15శాతం పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీరంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని పేర్కొన్నారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని, వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్‌ చెప్పారు.


ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.

Updated Date - 2020-05-22T16:05:40+05:30 IST