మా సభ్యులను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా తలొగ్గలేదు: కేశినేని నాని

ABN , First Publish Date - 2021-11-24T18:30:41+05:30 IST

కొండపల్లి టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబును, వైస్ ఛైర్మన్‌లుగా శ్రీలక్ష్మి, శ్రీనివాస్‌లను ఎంపిక చేసిందని ఎంపీ కేశినేని నాని తెలిపారు.

మా సభ్యులను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా తలొగ్గలేదు: కేశినేని నాని

విజయవాడ : కొండపల్లి ఛైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబును, వైస్ ఛైర్మన్‌లుగా శ్రీలక్ష్మి, శ్రీనివాస్‌లను టీడీపీ ఎంపిక చేసిందని ఎంపీ కేశినేని నాని తెలిపారు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక పూర్తైన అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి 16ఓట్లతో మెజారిటీ ఉందన్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన శ్రీలక్ష్మీ టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ సభ్యులను అనేక రకాలుగా ప్రలోభ పెట్టినా తలొగ్గ లేదన్నారు. అనేక రకాలుగా బెదిరించినా బెదరకుండా నిలబడ్డారన్నారు. ఇంకా కేశినేని నాని మాట్లాడుతూ.. ‘‘ఛైర్మన్ కోసం అధికార పార్టీ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నిలబడటం గొప్ప విషయం. డబ్బులకు అమ్ముడుబోయి అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. క్యాష్‌కి లొంగకుండా క్యారెక్టర్ కోసం ధైర్యంగా నిలబడిన మా సభ్యులకు కృతజ్ఞతలు. ఎన్నిక అంశం కోర్టులో ఉన్నందున పూర్తిగా స్పందించ లేను. అధికారం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తోంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-24T18:30:41+05:30 IST