ఓనం వేడుకల్లో నిర్లక్ష్యానికి కేరళ మూల్యం
ABN , First Publish Date - 2020-10-19T06:19:17+05:30 IST
ఓనం సంబరాల సమయం లో కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని,
కొవిడ్ను అడ్డుకోవడానికి పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి : కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 18: ఓనం సంబరాల సమయం లో కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆ నిర్లక్ష్యానికి కేరళ సర్కారు మూల్యం చెల్లిస్తోందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో తగిన ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలకు ఇది గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డారు. దసరా, దీపావళి పండుగలను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే, కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవడం ద్వారా కొవిడ్ ముప్పును తప్పించుకోవాలని మంత్రి సూచించారు.
వైరస్ సామాజిక వ్యాప్తి దేశవ్యాప్తంగా జరగట్లేదని, కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లోనే.. అది కూడా జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే జరుగుతోందని మంత్రి తెలిపారు. అంతేకాదు.. మనదేశంలో కరోనా వైర్సలో ఎలాంటి ఉత్పరివర్తనాలూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. వార్తాపత్రికల ద్వారా కరోనా వ్యాపించదని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానం చెప్పారు.
ముక్కు ద్వారా ఇచ్చే ‘కరోనా వ్యాక్సిన్’ పరీక్షలేవీ ప్రస్తుతం భారత్లో జరగట్లేదని స్పష్టం చేశారు. తగిన అనుమతులు పొందిన అనంతరం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వాటిపై ట్రయల్స్ జరపొచ్చని తెలిపారు. భారత మార్కెట్లలో చైనా ఆక్సీమీటర్ల వెల్లువపై అడిగిన ప్రశ్నకు.. ఎఫ్డీఏ లేదా సీఈ అనుమతి ఉన్న ఉత్పత్తుల కోసం చూడాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
అయితే, ఆక్సిజన్ స్థాయులు తగ్గడం కొవిడ్-19 లక్షణం మాత్రమే కాదని, ఇతరత్రా అనారోగ్య కారణాల వల్ల కూడా కావచ్చని పేర్కొన్నారు.