అంకుర సంస్థ రూపొందించిన పరికరంపై ఆసక్తి చూపిన భారత ఆర్మీ, పోలీసులు

ABN , First Publish Date - 2021-09-17T02:44:15+05:30 IST

కేరళకు చెందిన ఒక అంకుర సంస్థ రూపొందించిన థర్మల్ ఇమేజింగ్ సర్వైలైన్స్ యూనిట్ పై భారత ఆర్మీ అధికారులు

అంకుర సంస్థ రూపొందించిన పరికరంపై ఆసక్తి చూపిన భారత ఆర్మీ, పోలీసులు

తిరువనంతపురం: కేరళకు చెందిన ఒక అంకుర సంస్థ రూపొందించిన థర్మల్ ఇమేజింగ్ సర్వైలైన్స్ యూనిట్‌పై భారత ఆర్మీ అధికారులు, పోలీసులు ఆసక్తి చూపారు. సిరియాక్ పియస్(27) పాలక్కాడ్‌లో ఉన్న డిఫెన్స్ పార్కులో ఓజాక్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థను స్థాపించాడు. అతడు తిరువనంతపురంలోని ఇంజినీరింగ్ కళాశాల నుంచి 2016లో మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం ఎంటర్ ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాడు. కానీ, ఇంజినీరింగ్ విద్యార్థుల మాదిరిగానే ఒక బహుళ జాతి సంస్థలో రెండు ఏళ్లు పనిచేశాడు. అనంతరం కొచ్చిలో ఉన్న డిజిటల్ కోర్ టెక్నాలజీస్  సీఈఓ ఎస్.థామస్ పర్యవేక్షణలో ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. రిటైర్డ్ మేజర్ జనరల్ జాకోబ్ చాకో మార్గదర్శకత్వంలో ఒంటరిగానే ఎలక్ట్రానిక్ పరికరాలను రూపొందించడం మొదలుపెట్టాడు. థర్మల్ ఇమేజింగ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను రూపొందించాలనేది అతడి కల.


థర్మల్ ఇమేజింగ్ గురించి అతడు ఒక పత్రికతో మాట్లాడుతూ..‘‘ థర్మల్ ఇమేజింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన పరికరాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి ఒక ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ సిస్టమ్‌లో ఉపయోగించిన పాంథర్  అనే పరికరం అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో 24గంటల పాటు పనిచేస్తుంది. ఈ పరికరం చాలా తక్కువ బరువు ఉండి సమర్థమంతంగా పనిచేస్తుంది. ఇది చాలా కచ్చితత్వంతో పనిచేస్తూ ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను చేధించగలదు. ప్రభుత్వం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మేం థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ను ప్రదర్శించాం. ఈ సిస్టమ్ పై భారత ఆర్మీ అధికారులు, పోలీసులు ఆసక్తిని చూపించారు ’’ అని పేర్కొన్నాడు. సిరియాక్ తన కలల ప్రాజెక్టుపై రూ.75లక్షల వరకు వెచ్చించాడు. టర్కీకి చెందిన 3ఈ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్‌లర్ సిరియాక్‌కు చెందిన ఓజాక్ టెక్నాలజీస్‌కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి విభాగంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది.

Updated Date - 2021-09-17T02:44:15+05:30 IST