లైంగిక సంబంధం కోసం భార్యల మార్పిడి...రాకెట్‌ గుట్టురట్టు చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-01-10T16:52:34+05:30 IST

సభ్య సమాజం తలదించుకునేలా భార్యల మార్పిడి రాకెట్ బాగోతం కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది....

లైంగిక సంబంధం కోసం భార్యల మార్పిడి...రాకెట్‌ గుట్టురట్టు చేసిన పోలీసులు

ఏడుగురి అరెస్ట్...1000 జంటల ప్రమేయముందని పోలీసుల అనుమానం

తిరువనంతపురం (కేరళ):సభ్య సమాజం తలదించుకునేలా భార్యల మార్పిడి రాకెట్ బాగోతం కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. లైంగిక సంబంధం కోసం భార్యలను మార్పిడి చేసుకున్న రాకెట్‌లో ఏడుగురు నిందితులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యల రాకెట్ బాగోతంలో దాదాపు 1000 జంటల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న భర్తపై ఓ మహిళ కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇంతకుముందు కాయంకుళం ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. భార్యల మార్పిడి రాకెట్ కేరళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగించుకుందని పోలీసులు చెప్పారు. 


‘‘భార్యలను మార్పిడి చేసుకున్నవారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నాం. దీని వెనుక చాలామంది పాత్ర ఉందని, ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని చంగంచెరి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ చెప్పారు.నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్‌లో భాగమని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో  మరింత మంది నిందితులను అరెస్టు చేస్తామని కేరళ పోలీసులు వివరించారు. 


Updated Date - 2022-01-10T16:52:34+05:30 IST