Kerala:శబరిమల భక్తులకు సర్కార్ మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-10-08T14:31:01+05:30 IST

కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది....

Kerala:శబరిమల భక్తులకు సర్కార్ మార్గదర్శకాలు

నవంబరు 16 నుంచి తీర్థయాత్ర ప్రారంభం

శబరిమల(కేరళ): కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.నవంబరు 16వతేదీ నుంచి శబరిమలలో తీర్థయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో రోజుకు 25వేల మంది భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కొవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు లేదా ఆర్టీపీసీఆర్ ప్రతికూల నివేదిక ఉన్న భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు.కొవిడ్ నేపథ్యంలో అయ్యప్పస్వామి దర్శనం తర్వాత భక్తులు సన్నిధానంలో ఉండటానికి అనుమతించరు.


అభిషేకం తర్వాత భక్తులకు నెయ్యి ఇచ్చే ఏర్పాట్లు చేయాలని దేవస్థానం బోర్డును కేరళ  సర్కారు ఆదేశించింది. గత సంవత్సరం లాగానే యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీమార్గంలో, పుల్మేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని నిర్ణయించారు.నీలక్కల్ వరకు మాత్రేమ భక్తుల వాహనాలను అనుమతిస్తారు. అక్కడ నుంచి స్నానానికి పంపానదికి వెళ్లేందుకు భక్తులు కేఎస్సార్టీసీ బస్సులను ఉపయోగించాలి. శబరిమల తీర్థయాత్ర సందర్భంగా దేవస్థానం, రవాణ, అటవీ, ఆరోగ్య, నీటివనరుల శాఖ మంత్రులు, పోలీసు అధికారులతో సీఎం చర్చించి భక్తులకు కొత్త మార్గదర్శకాలు రూపొందించారు.


ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొవిడ్ పరీక్షల తర్వాతే తీర్థయాత్రకు రావాలని సీఎం పినరయి విజయన్ సూచించారు. దేవస్థానం భవనాల్లో స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళలో గురువారం ఒక్కరోజే 12,288 కరోనా కేసులు వెలుగుచూడగా, వారిలో 141 మంది మరణించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శబరిమల భక్తులు అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు కోరింది.


Updated Date - 2021-10-08T14:31:01+05:30 IST