బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై 31 వరకూ నిషేధం
ABN , First Publish Date - 2020-08-03T23:21:17+05:30 IST
కేరళలోని బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు, ఊరేగింపులు, నిరసనలపై నిషేధాన్ని ఆగస్టు..
తిరువనంతరపురం: కేరళలోని బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు, ఊరేగింపులు, నిరసనలపై నిషేధాన్ని ఆగస్టు 31వ తేదీ వరకూ రాష్ట్ర హైకోర్టు సోమవారంనాడు పొడిగించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్లాక్-3 గైడ్లైన్స్కు లోబడి హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
దీనికి ముందు, జూలై 31 వరకూ రాష్ట్రంలో అన్ని రకాల బహిరంగ నిరసనలపై కోర్టు నిషేధం విధించింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నిషేధం ఆగస్టు 31 వరకూ పొడిగించింది. గత 24 గంటల్లో 1,129 కరోనా కేసులు నమోదు కావడం, ఎనిమిది మంది మరణించడంతో కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,682 యాక్టిక్ కేసులు నమోదు కాగా, 13,779 మందికి స్వస్థత చేకూరింది. మరణాల సంఖ్య 81కి చేరింది.
తిరువనంతపురంలో అత్యధిక స్థాయిలో 3,157 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 886 కేసులతో ఎర్నాకులం జిల్లా రెండో స్థానంలో ఉంది. 1,43,996 మంది వివిధ ప్రాంతాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. వీరిలో 10,380 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 17 కొత్త వాటితో కలిపి 492 హాట్స్పాట్లు ఉన్నాయి.