లవ్ జిహాద్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. తమది ప్రేమ వివాహమన్న మహిళ

ABN , First Publish Date - 2022-04-19T20:37:57+05:30 IST

జోస్న మేరి జోసెఫ్ అనే క్రిస్టియన్ మహిళ షెజిన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెల్లిని వ్యతిరేకిస్తూ మేరి తండ్రి కోర్టులో హెబాస్ కార్పస్ పిటిషన్ వేశారు. వారి పెళ్లి లవ్ జిహాదీ అని, ఆ పెళ్లిని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు...

లవ్ జిహాద్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. తమది ప్రేమ వివాహమన్న మహిళ

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలోని ఒక ‘లవ్ జిహాద్’ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ విషయమై వచ్చిన పిటిషన్‌ను విచారించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. అంతే కాకుండా ‘ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అది ఆమె ఇష్టానికి సంతోషానికి సంబంధించిన విషయం’ అని లవ్ జిహాద్‌ అంశాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్న వారికి ఇబ్బందికరమైన సమాధానం చెప్పింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.


జోస్న మేరి జోసెఫ్ అనే క్రిస్టియన్ మహిళ షెజిన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెల్లిని వ్యతిరేకిస్తూ మేరి తండ్రి కోర్టులో హెబాస్ కార్పస్ పిటిషన్ వేశారు. వారి పెళ్లి లవ్ జిహాదీ అని, ఆ పెళ్లిని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఒక్క కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చను లేవనెత్తింది. కాగా, ఈ పిటిషన్‌పై కోర్టు ముందు మేరీ మాట్లాడుతూ ‘‘నేను అతడిని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే, నేను అతడిని ప్రేమించాను. నాకు అతడు నచ్చాడు. కాబట్టి నేను అతడితోనే జీవించాలని అనుకుంటున్నాను. 18 ఏళ్లు దాటిన వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మా ఇరు కుటుంబాలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నారు.


కాగా, ఈ విషయమై షెజిన్ స్పందిస్తూ ‘‘నేను మతానికి అతీతుడిని. ఒకవేళ మేరి క్రైస్తవాన్ని పాటిస్తాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఆమె వ్యక్తిగత విషయం. నేను దాంట్లో వేలు పెట్టలేను. అలాగే నాకు సంబంధించిన వ్యక్తిగతమైన అభిప్రాయాల్లో ఆమె కూడా అభ్యంతరం చెప్పదని అనుకుంటున్నాను. ఇది మా చివరి శ్వాస వరకు కొనసాగాలని నా ఆశ. ఎవరికి ఎలా నచ్చితే వారు అలా బతకొచ్చు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-19T20:37:57+05:30 IST