KERALA MINISTER: కిడ్నీ రోగికి బంగారు గాజులు దానం.. ఆమె ఎవరంటే..?
ABN , First Publish Date - 2022-07-13T01:49:09+05:30 IST
కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు గొప్ప మనస్సు చాటుకున్నారు. ఓ కిడ్నీ రోగి చికిత్స కోసం.. తన చేతికి ఉన్న బంగారు గాజులను సాయంగా అందజేశారు. త్రిసూర్ జిల్లాలోని ఇరింజళకుడలో..
కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు గొప్ప మనస్సు చాటుకున్నారు. ఓ కిడ్నీ రోగి చికిత్స కోసం.. తన చేతికి ఉన్న బంగారు గాజులను సాయంగా అందజేశారు. త్రిసూర్ జిల్లాలోని ఇరింజళకుడలో జరిగిన ఓ మెడికల్ ఎయిడ్ కమిటీ సమావేశానికి మంత్రి ఆర్. బిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం ముగించుకుని ఆమె తిరిగి వెళ్తుండగా.. వివేక్ ప్రభాకర్ అనే కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఆమె వద్దకు చేరుకుని తన సమస్యను వివరించాడు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పాడు. తనకు వెంటనే కిడ్నీ మార్చాల్సి ఉందని తెలిపాడు. అయితే పేద కుటుంబానికి చెందిన తన వద్ద ఆపరేషన్ చేయించకునేంత డబ్బు లేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
వివేక్ ప్రభాకర్ పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా చలించిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి.. చికిత్స నిమిత్తం అతనికి విరాళంగా అందజేశారు. దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత వారందరూ మంత్రి గారిపై ప్రశంసల వర్షం కురిపించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. అతడికి ప్రభుత్వ సహాకారంతో ట్రీట్మెంట్ చేయించాలని మంత్రిగారిని కోరుతున్నారు.