ఉత్తర ప్రదేశ్ పోలీసులపై కేరళ సీఎం ఫైర్

ABN , First Publish Date - 2020-10-01T05:30:00+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేయిచేసుకున్న ఉత్తర ప్రదేశ్ పోలీసులపై కేరళ సీఎం పినరయి విజయన్..

ఉత్తర ప్రదేశ్ పోలీసులపై కేరళ సీఎం ఫైర్

తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేయిచేసుకున్న ఉత్తర ప్రదేశ్ పోలీసులపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అన్ని హక్కులూ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం హత్రాస్ వెళ్లిన రాహుల్ గాంధీకి, అక్కడి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టడంతో ఆయన కిందపడిపోయారు. ఈ ఘటనపై కేరళ సీఎం ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘‘హత్రాస్ వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అన్ని ప్రజాస్వామ్య హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగం సైతం పూర్తి స్వేచ్ఛ కల్పిస్తోంది. దీన్ని అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమే. ప్రజాస్వామిక సమాజంలో ఇలాంటి వాటికి చోటు లేదు. రాహుల్ గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం..’’ అని పేర్కొన్నారు. కాగా గురువారం హత్రాస్ వెళ్లిన రాహుల్, ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. అక్కడి పోలీసులు అనుమతించకపోవడంతో కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గౌతమ్ బుద్ధ నగర్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద యూపీ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-10-01T05:30:00+05:30 IST