ఒమైక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికుల విషయంలో కేరళ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-11-29T16:55:50+05:30 IST
కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ‘కంట్రీస్ ఎట్ రిస్క్’ జాబితాలో ఉన్న దే
ఎన్నారై డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ‘కంట్రీస్ ఎట్ రిస్క్’ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనను తప్పనిసరి చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రిత్వ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నిబంధనలను ఒకసారి పరిశీలిస్తే..
యూరోపియన్ దేశాలు, యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్, ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్, జింబాబ్వే దేశాలు ‘కంట్రీస్ ఎట్ రిస్క్’ జాబితాలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణికులు.. ఎయిర్ పోర్ట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్ట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అంతేకాకుండా.. ఫలితాలు వచ్చే వరకు విమానాశ్రయంలో వేచి ఉండాలని తెలిపింది. టెస్టులో పాజిటివ్గా తేలితే.. నిబంధనల ప్రకారం సదరు ప్రయాణికుడు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుందని వెల్లడించింది.
నెగిటివ్ వచ్చినా.. 7రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండి.. 8వ రోజున మళ్లీ కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. విదేశీ ప్రయాణికులు ఇండియాకు ప్రయాణించే ముందు తమ 14 రోజుల ట్రావెల్ హిస్టరీ సమాచారాన్ని ఎయిర్ సువిధా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని.. నెగెటివ్ సర్టిఫికెట్ను పోర్టల్లో తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని వెల్లడించింది. ఈ నింబంధనలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం వివరించింది.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకానలు అనుసరించి ‘కంట్రీస్ ఎట్ రిస్క్’ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ క్వారంటైన్ నిబంధనను తప్పనిసరి చేసింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ట్రావెల్ ప్రొటోకాల్ను కచ్చితంగా పాటించాలని వెల్లడించింది.