ఢిల్లీలో ఇచ్చాం..గోవాలోనూ ఇస్తాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-07-14T21:07:22+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కడితే ప్రతినెలా 300 యూనిట్ల వరకూ..

ఢిల్లీలో ఇచ్చాం..గోవాలోనూ ఇస్తాం: కేజ్రీవాల్

పనజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కడితే ప్రతినెలా 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. రెండ్రోజుల క్రితం గోవా వచ్చిన కేజ్రీవాల్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్‌ అనేది ఎన్నికల్లో తమ పార్టీ ఇస్తున్న తొలి హామీ అని చెప్పారు. గోవాలో 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని, ఈ స్కీమ్ అమలుతో గోవాలో 87 శాతం మంతి లబ్ధి పొందుతారన్నారు. పాత బకాయిలను రద్దు చేస్తామని, 24 గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నప్పుడు, గోవా ప్రజలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గోవా విద్యుత్ మిగులు రాష్ట్రమైనప్పటికీ తరచు విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.


గత గోవా ఎన్నికల తర్వాత బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీలను విడిచిపెట్టిన ఎమ్మెల్యేలపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఇలా వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో విపక్షంలో ఉండాల్సిన వాళ్లు (బీజేపీ) ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారని, అధికారంలో ఉండాల్సిన వాళ్లు విపక్షంలో కూర్చోవలసి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పని చేసేందుకు బీజేపీలో చేరామని చెప్పిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజల అంచనాల మేరకు పనిచేశారా? డబ్బులు ఎర చూపించడంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఇప్పుడు ప్రజలు చెబుతున్నారని, ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. గోవా రాజకీయాలకు అవినీతి, ఫిరాయింపుల జబ్బు పట్టుకుందని, రాష్ట్రంలోని రాజకీయ సంస్కృతిలో మార్పు తీసుకురావాలని 'ఆప్' కోరుకుంటోందని, సచ్ఛీల రాజకీయాలను తాము ఆశిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

Updated Date - 2021-07-14T21:07:22+05:30 IST