అన్నివర్గాలనూ మోసం చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-06-30T06:08:09+05:30 IST

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలనూ మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 109వ రోజైన బుధవారం చివ్వెంల మండలం బీబీగూడెం నుంచి జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఖమ్మం క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌, గాంధీ విగ్రహం, పొట్టిశ్రీరాములు సెంటర్‌, సైనిక్‌పురి కాలనీ వరకు ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది.

అన్నివర్గాలనూ మోసం చేసిన కేసీఆర్‌
సూర్యాపేట జిల్లాకేంద్రంలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల


సూర్యాపేట టౌన్‌, జూన్‌ 29: కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలనూ మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 109వ రోజైన బుధవారం చివ్వెంల మండలం బీబీగూడెం నుంచి జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఖమ్మం క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌, గాంధీ విగ్రహం, పొట్టిశ్రీరాములు సెంటర్‌, సైనిక్‌పురి కాలనీ వరకు ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. పట్టణంలోని గాంధీచౌక్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ కాకుండా బార్ల తెలంగాణగా సీఎం కేసీఆర్‌ మార్చారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏమి చేశారో తెలపాలని సవాల్‌ విసిరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌స్టోరేజ్‌, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లు ఎటుపోయాయని ప్రశ్నించారు. వీళ్లపాలన తీరు తాగుబోతు తాగి నిద్రపోయిన్నట్లుగా ఉందన్నారు. 


రూ.5వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి

స్కూటర్‌ మీద తిరిగిన మంత్రి జగదీ్‌షరెడ్డి ఎలా రూ.5వేలకోట్లు సంపాదించారో ప్రజలకు తెలపాలని వైఎస్‌ షర్మిల అన్నారు. సాండ్‌, ల్యాండ్‌ మాఫియా, చెరువుల ఆక్రమణ, అసైన్డ్‌, ప్రభుత్వ భూముల ఆక్రమణ అన్నీ మంత్రి జగదీ్‌షరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. పైన పటారం, లోన లోటారంలా సూర్యాపేట జిల్లా పరిస్థితి ఉందన్నారు. కరెంట్‌ బిల్లులు చూస్తే ప్రజలకు షాక్‌ కొడుతుందని, ప్రభుత్వ సంస్థల నుంచి రూ.13వేలకోట్లు బకాయిలు రావాల్సి ఉండగా, అడిగే దమ్ములేని మంత్రి జగదీ్‌షరెడ్డికి ప్రజల నుంచి ముక్కుపిండి రూ.6వేల కోట్ల బకాయిలు మాత్రం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మోసానికి గురికానివర్గమంటూ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. 


వరివేస్తే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేడు

వరి వేస్తే ఉరి అనే సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేడని వైఎస్‌ షర్మిల విమర్శించారు. వ్యవసాయానికి రూ.30వేలు లబ్ధిచేకూరే పథకాలను బంద్‌ చేశారని, కేవలం రూ.5వేలు రైతుబంధుతో రైతులు కార్లలో తిరుగుతూ కోటీశ్వర్లు అవుతారా అని ప్రశ్నించారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, రావినారాయణరెడ్డి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ, బెల్లి లలితవంటి ఎంతోమంది వీరులను కన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపై మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డికి ఎనలేని ప్రేమ ఉండేదన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు 33సార్లు వచ్చారని గుర్తు చేశారు. ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా నల్లగొండను మార్చడానికి వైఎస్‌ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టారాంరెడ్డి, ఏపూరి సోమన్న, బీరెల్లి శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రఫి, వేణు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:08:09+05:30 IST