‘కాళ్లు మొక్కుతా కేసీఆర్‌ సార్‌.. నోటిఫికేషన్‌ ఇవ్వండి’

ABN , First Publish Date - 2021-11-01T13:46:15+05:30 IST

టీటీసీ పూర్తిచేసి నాలుగేళ్లయినా నోటిఫికేషన్‌ వేయడం లేదని ఆ యువకుడు ఆవేదన చెందాడు. తనను కష్టపడి చదవించిన తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతున్నానని, వారికి భారంగా మారానని మనోవేదనకు గురయ్యాడు! నోటిఫికేషన్‌ ఇక రాదేమోనని..

‘కాళ్లు మొక్కుతా కేసీఆర్‌ సార్‌.. నోటిఫికేషన్‌ ఇవ్వండి’

నోటిఫికేషన్లు లేవని ప్రాణం తీసుకున్నాడు!

సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగిన యువకుడు

టీటీసీ పూర్తి.. కన్నవారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన 

‘కాళ్లు మొక్కుతా కేసీఆర్‌ సార్‌.. నోటిఫికేషన్‌ ఇవ్వండి’అంటూ వినతి

ఆర్థిక ఇబ్బందులతోనేనని తల్లిదండ్రుల ఫిర్యాదు.. నేతల ఒత్తిడి వల్లే?


కోటపల్లి: టీటీసీ పూర్తిచేసి నాలుగేళ్లయినా నోటిఫికేషన్‌ వేయడం లేదని ఆ యువకుడు ఆవేదన చెందాడు. తనను కష్టపడి చదవించిన తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోతున్నానని, వారికి భారంగా మారానని మనోవేదనకు గురయ్యాడు! నోటిఫికేషన్‌ ఇక రాదేమోనని రంధి పడి బతకడం వృధా అనుకున్నాడు. ‘కేసీఆర్‌ సార్‌ నీ కాళ్లు మొక్కుతా.. నాలాంటి వారు చాలా మంది ఉన్నారు, నా చావే చివరిది కావాలి. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయండి’ అని నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలక గ్రామానికి చెందిన ఆసంపల్లి మహేశ్‌ (24) అనే యువకుడిదీ విషాదాంతం.


శనివారం ఇంటి నుంచి వెళ్లిన మహేశ్‌ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడం, ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చీకటి పడే దాకా గాలించినా జాడ దొరకలేదు. ఆదివారం వెల్మపల్లి సమీపంలోని పత్తిచేనులో మహేశ్‌ మృతదేహం కనిపించింది. స్థానిక కూలీలు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించింది. తల్లిదండ్రులు తనను క్షమించాలని, తనను ఎంతో కష్టపడి చదివించారని, కానీ నోటిఫికేషన్‌లు రాక ఉద్యోగం రాలేదని అందులో పేర్కొన్నాడు. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ కొడుకు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.


చెన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేసిన తమ కొడుకు ఈ ప్రాంతానికి చెందిన కొందరిని సభ్యులుగా చేర్పించాడని, ఇటీవల ఆ చిట్‌ఫండ్‌ ఎత్తేయడంతో సభ్యులు తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తమ కుమారునిపై ఒత్తిడి తేవడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం నోటిఫికేషన్‌లు విడుదల చేయాలంటూ గ్రామానికి చెందిన కొందరు యువకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్సై రవికుమార్‌ ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు. 



Updated Date - 2021-11-01T13:46:15+05:30 IST