ధాన్యం కొనుగోలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ABN , First Publish Date - 2021-12-16T22:53:04+05:30 IST
ధాన్యం కొనుగోలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత ఇచ్చాకే సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత ఇచ్చాకే సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా స్పష్టమైందని చెప్పారు. తానే ముఖ్యమంత్రి అని ప్రజలకు గుర్తుచేయటానికే కేసీఆర్ జిల్లాల పర్యటనలని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పి జిల్లాల పర్యటనలకు వెళ్లాలన్నారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచనని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారన్నారు. బీసీ కార్పొరేషన్కు కేటాయించిన వెయ్యి కోట్లు రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఏమైందో చెప్పి.. పాసు పుస్తకాలు రైతుల చేతిలో పెట్టి జిల్లాల్లో పర్యటించాలన్నారు.
ధరణి లోపాలు ఎందుకు సవరించలేదు.. ఇబ్బందులు పడుతున్న వారికి సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ వ్యవహారంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం నలుగురు కుటుంబ సభ్యుల మధ్య పోటీ నడుస్తుందన్నారు.
టీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.