27న పెంచికల్పేటలో కేసీఆర్ బహిరంగ సభ
ABN , First Publish Date - 2021-10-20T08:49:24+05:30 IST
27న పెంచికల్పేటలో కేసీఆర్ బహిరంగ సభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ఎల్కతుర్తి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈనెల 27న హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల పేటలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు వీలుకాక పోవడంతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఈ నెల 25న జరగనున్న పార్టీ ప్లీనరీలో ప్రకటించనున్నారు. దీన్ని పురస్కరించుకుని పెంచికల పేట సభను నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార గడువు ఆ రోజుతోనే ముగుస్తుండడం గమనార్హం. సభాస్థలిని మంగళవారం మంత్రి హరీశ్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివా్సయాదవ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ సభకు సుమారు లక్షన్నర మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.