బిహార్‌లో కేసీఆర్‌ తెలంగాణ పరువు తీశారు: అర్వింద్‌

ABN , First Publish Date - 2022-09-02T02:53:19+05:30 IST

సీఎం కేసీఆర్‌ బిహార్‌కు వెళ్లి తెలంగాణ పరువు తీశారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు.

బిహార్‌లో కేసీఆర్‌ తెలంగాణ పరువు తీశారు: అర్వింద్‌

నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ బిహార్‌కు వెళ్లి తెలంగాణ పరువు తీశారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ కేసీఆర్‌ స్పీచ్‌ను ఆపాలని పదే పదే కోరుతున్నా.. తెలంగాణలో గంటల తరబడి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడి పరువు తీశారన్నారు. అందువల్లే నితీష్‌కుమార్‌ లేచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌కు వస్తున్నారని గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ గతంలో నిజామాబాద్‌ జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ తెలియజేసేందుకు ఈ నెల 3వ తేదీన నిజామాబాద్‌లో ‘ఇందూరు జనతాకో జవాబ్‌ దో’ పేరిట బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్నామని అర్వింద్‌ తెలిపారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా ఇప్పటివరకు ఇవ్వలేదని, అందువల్లే ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా సీఎం సభకు తనను ఇంత వరకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. వెంటనే సభకు తనను ఆహ్వానించాలని, కేవలం ఆహ్వానించడమే కాకుండా సీఎం సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తేనే తాను వెళ్తానని అర్వింద్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-02T02:53:19+05:30 IST