ఉద్యోగుల పనితీరుపై అధ్యయనం

ABN , First Publish Date - 2022-01-17T08:06:45+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో వారి భాగస్వామ్యంపై అధ్యయనానికి సీఎం కేసీఆర్‌ పరిపాలనా సంస్కరణల కమిటీని

ఉద్యోగుల పనితీరుపై అధ్యయనం

నలుగురు ఐఏఎస్‌లతో 

పరిపాలనా సంస్కరణల కమిటీ

ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల 

భాగస్వామ్యంపై అధ్యయనం చేయాలి

ప్రభుత్వానికి సలహాలు అందించాలి

వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సూచనలివ్వాలి

కమిటీని ఆదేశించిన సీఎం కేసీఆర్‌

అద్భుత పాలన అందించడమే లక్ష్యమని వెల్లడి


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో వారి భాగస్వామ్యంపై అధ్యయనానికి సీఎం కేసీఆర్‌ పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఈ కమిటీని వేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో సర్కారీ ఉద్యోగుల పనితీరు తదితర అంశాలపై అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి కేసీఆర్‌ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ సభ్యులుగా ఉంటారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా అందరూ ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు గురించి, ఇంకా మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీని ఆదేశించారు. ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాలు, మండలాల్లో శాఖలకు ఉన్న పని ఒత్తిడిని అంచనా వేసి దానికనుగుణంగా కొత్త పోస్టుల అవసరాన్ని గుర్తించడం, సాంకేతికంగా ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాల మీద అధ్యయనం చేయాలని సూచించారు.


రాష్ట్ర ప్రజలకు అద్భుత సేవలందించాలి..

వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని కేసీఆర్‌ ఈ కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సభర్వాల్‌, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T08:06:45+05:30 IST