లక్ష మందితో కేసీఆర్ సభ!
ABN , First Publish Date - 2021-04-08T08:12:48+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అధికార టీఆర్ఎస్.. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
- సాగర్ ఎన్నికకు 14న హాలియాలో
- క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అధికార టీఆర్ఎస్.. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం సభ ఏర్పాటు ఖాయమైంది. సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అప్పటికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ నేతలు క్షేత్రంలో శ్రమిస్తున్నారు. ఓవైపు ప్రచారంలో భాగస్వాములవుతూనే, మరోవైపు కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హాలియా సభలో సీఎం కేసీఆర్ చేయనున్న ప్రసంగం టీఆర్ఎస్ ప్రచారంలో కీలకమవుతుందని గులాబీ దళం భావిస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే, నియోజకవర్గం నలుమూలల నుంచి కేసీఆర్ సభకు పెద్దఎత్తున జనాలను తరలించాలన్న సందేశాలు కింది స్థాయికి వెళ్లాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎ్సపై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ ముఖ్యులు వ్యక్తం చేస్తున్నారు.