కేసీఆర్ మేడారం పర్యటన రద్దు
ABN , First Publish Date - 2022-02-19T00:16:18+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేడారం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఆయన వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు
భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేడారం పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఆయన వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మేడారం చేరుకున్నారు. హెలీప్యాడ్ను సిద్ధం చేయడంతోపాటు రోప్ పార్టీతో మాక్డ్రిల్ నిర్వహించి సీఎం కోసం నిరీక్షించారు. అయినప్పటికీ సీఎంవో నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సాయంత్రం 4గంటల వరకు ఎదురుచూసి అంతా తిరుగుముఖం పట్టారు. టీఆర్ఎస్ శ్రేణులు, మేడారం వచ్చిన భక్తులు కేసీఆర్ రాకపోవడంతో నిరాశ చెందారు. కాగా, పర్యటన రద్దు వెనుక కారణాలపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ఠాక్రేతో కేసీఆర్ భేటి ఉంది. దీనికి సంబంధించి కీలకనేతలు, సలహాదారులతో కేసీఆర్ సమీక్షిస్తున్నట్లుగా సమాచారం అందింది. దేశ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కూడా సంప్రదింపులు జరిపే క్రమంలోనే మేడారం రాలేకపోయారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆరోగ్యం సహకరించకపోవడంతో మేడారం పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ మేడారానికి రాకపోవడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది.