కేసీఆర్ ఏది చేస్తే.. జగన్ అదే చేస్తారు: బైరెడ్డి
ABN , First Publish Date - 2022-03-06T00:23:01+05:30 IST
ముఖ్యమంత్రి జగన్.. సొంతంగా పాలన చేయడం లేదని, అంతా సలహాదారుల నిర్ణయాలతోనే సాగుతోందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
కర్నూలు: ముఖ్యమంత్రి జగన్.. సొంతంగా పాలన చేయడం లేదని, అంతా సలహాదారుల నిర్ణయాలతోనే సాగుతోందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి విమర్శించారు. నూతన జిల్లాల ఏర్పాటును నిరసిస్తూ శనివారం కర్నూలు శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఆయన ప్రజా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యాస తిట్లు తిట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఒక వాత పెడితే.. జగన్ రెండు వాతలు పెడుతున్నారని విమర్శించారు. జగన్కు సొంతంగా ఆలోచించే తెలివి లేదన్నారు. సలహాదారుల మాటలు విని రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ ఏది చేస్తే.. జగన్ అదే చేస్తున్నారన్నారని తప్పుబట్టారు. నూతన జిల్లాల ఏర్పాటులో అనేక లోటుపాట్లు ఉన్నాయన్నారు. ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చెప్పారు.