పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది: విజయశాంతి
ABN , First Publish Date - 2022-04-15T02:10:02+05:30 IST
పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. శ్రీరామసాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ జలాలు చెరువులకు అందడం లేదని, మరమ్మతుల పేరుతో అధికారులు జలాలు విడుదల చేయడం లేదని ఆమె విమర్శించారు. కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా... ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి కూడా చూడడం లేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం యంత్రాంగం చోద్యం చూస్తోందని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా? దీనికేం సమాధానం చెబుతావు? అని కేసీఆర్ను విజయశాంతి ప్రశ్నించారు. రాములమ్మ పోస్టుయథాతథంగా...
''శ్రీరామసాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ జలాలు చెరువులకు అందడం లేదు. మరమ్మతుల పేరుతో అధికారులు జలాలు విడుదల చేయడం లేదు. కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయ్యారు. వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా... ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరమ్మతుల పేరిట చెరువులకు ఎస్సారెస్పీ జలాలు అందకుండా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి... వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొత్తుకుంటున్నా అస్సలు పట్టించుకోకపోవడం లేదు. మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం యంత్రాంగం చోద్యం చూస్తోంది. కేసీఆర్... బంగారు తెలంగాణ అంటే ఇదేనా? దీనికేం సమాధానం చెబుతావు? యాసంగిలో ఎస్సారెస్పీ జలాలు విడుదల చేస్తమని, పంటలు వేసుకోండని చెప్పిన అధికారులే నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా అనేక సాకులు చెబుతూ దాటవేస్తున్నరు. పంటలను కాపాడేందుకు తాము బాగా కష్టపడుతున్నమంటూ పైపైకి నటిస్తూ... తాము చేయదల్చుకున్నది హాయిగా చేసుకుపోతున్నరు. ఓ పక్క భూగర్భజలాలు అడుగంటి బోర్లు సరిగా పోయట్లేదు. మరోపక్క ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందట్లేదు. వెరసి ఆయకట్టు పరిధిలోని భూముల్లో వరిపైరు ఎండిపోతున్నది. రైతులు ఆ పొలాల్లో పశువులను మేపుకుంటున్నరు. యాసంగిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వం అని.... సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా ఎస్సారెస్పీ జలాలను పొలాలకు అందించాలి. కమిషన్ల కోసం కక్కుర్తి పడే ఈ ప్రభుత్వానికి రైతన్నలే తగిన బుద్ధి చెబుతారు.'' అని విజయశాంతి అన్నారు.